ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

8 Aug, 2019 10:07 IST|Sakshi

హైదరాబాద్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి, ఎనిమిదో సీడ్‌ మేఘన జక్కంపూడి–పూర్వీషా రామ్‌ జోడీలు శుభారంభం చేశాయి. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో ఈ జంటలు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. బుధవారం మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌సీడ్‌ అశ్విని–సిక్కి రెడ్డి ద్వయం 21–13, 13–21, 21–16తో తాన్‌ పెర్లీ కూంగ్‌లీ–మురళీథరన్‌ థినా (మలేసియా) జోడీపై గెలుపొందగా... మేఘన–పూర్వీషా జంట 21–10, 21–6తో అన్ను ధన్‌కర్‌–అనుభా కౌశిక్‌ (భారత్‌) జోడీని సులువుగా ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా–రోహన్‌ కపూర్‌ జంట తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. అర్జున్‌–శ్లోక్‌ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ ప్రణవ్‌ చోప్రా–రోహన్‌ కపూర్‌ ద్వయం 18–21, 21–13, 14–21తో షోహిబుల్‌ ఫక్రీ–బగాస్‌ మౌలానా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో సీడ్‌ అర్జున్‌–శ్లోక్‌ (భారత్‌) జంట 21–11, 21–8తో గౌరవ్‌–దీపక్‌ ఖత్రి (భారత్‌) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. ఇతర తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో వైభవ్‌–ప్రకాశ్‌ రాజ్‌ (భారత్‌) జంట 21–18, 17–21, 21–18తో అమర్‌– ముహమ్మద్‌ అమీర్‌ (మలేసియా) జోడీపై, విఘ్నేశ్‌–దీప్‌ (భారత్‌) ద్వయం 21–14, 21–19తో సెంథిల్‌ గోవింద్‌– రెహాన్‌ (భారత్‌) జోడీపై గెలుపొందాయి.  

మహిళల డబుల్స్‌ తొలిరౌండ్‌ ఫలితాలు: నాలుగో సీడ్‌ వింగ్‌ యుంగ్‌–యెంగ్‌ టింగ్‌ (హాంకాంగ్‌) ద్వయం 21–10, 21–13తో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్‌ (భారత్‌) జోడీపై, పూజ దండు–సంజన సంతోష్‌ (భారత్‌) ద్వయం 1–0తో రుతుపర్ణ–ఆరతి (భారత్‌) జోడీపై, గావో జి యావో–పెంగ్‌ కిన్‌ (చైనా) ద్వయం 21–15, 21–16తో కుహూ గార్గ్‌–అనౌష్క పరీఖ్‌ (భారత్‌) జంటపై గెలుపొంది ముందంజ వేశాయి.

>
మరిన్ని వార్తలు