ప్రపంచకప్‌ ప్రస్తావన లేకుండానే...

29 May, 2020 00:02 IST|Sakshi

ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌:  షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్‌ కప్‌ జరగాల్సి ఉంది. అంతకు ముందు అక్టోబరు 11, 14, 17 తేదీల్లో భారత్‌తో 3 టి20ల్లో తలపడనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) గురువారం ప్రకటించింది. వీటికి వేదికలు కూడా ఖరారు చేసింది. మరి తర్వాతి రోజునుంచే జరగాల్సిన ప్రపంచకప్‌ నిర్వహణపై మాత్రం ఇంకా సందేహాలు కనిపిస్తున్నాయి! ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా జరిగే 2020–21 హోమ్‌ సీజన్‌ షెడ్యూల్‌లో భారత్‌తో 4 టెస్టులు, 3 వన్డేలు కూడా ఉన్నాయి. ఏడు పురుషుల టోర్నీలు, మూడు మహిళల ఈవెంట్లకు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్‌ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించింది. ఆగస్టు 9నుంచి జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌తో మళ్లీ అక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభం అవుతుంది. భారత్‌తో టెస్టులకంటే ముందుగా మూడు టి20లు జరుగుతాయి. అక్టోబర్‌లో విండీస్‌తో మూడు టి20లు, నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, జనవరి, ఫిబ్రవరిల్లో  న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడుతుంది. భారత్, ఆసీస్‌ మహిళా జట్ల మధ్య జనవరిలో మూడు వన్డేలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు