భారత్‌కు తాడోపేడో

3 Dec, 2015 00:41 IST|Sakshi

నేడు బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్  హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ
 నేటి క్వార్టర్ ఫైనల్స్
 సాయంత్రం గం. 6.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 రాయ్‌పూర్: లీగ్ దశలో నిరాశపరిచిన భారత హాకీ జట్టు నాకౌట్ దశలో లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ ‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్న బ్రిటన్‌ను ఓడించాలంటే భారత ఆటగాళ్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది.
 
 గ్రూప్ ‘ఎ’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలిచిన భారత్ నిర్ణాయక మ్యాచ్‌లో పూర్తి సమన్వయంతో ఆడటంతోపాటు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతుంది. ‘భారత ఆటగాళ్లలో నిలకడలేమి ఉందని చెప్పలేను. అయితే కొన్ని విభాగాల్లో మాత్రం కచ్చితంగా పురోగతి సాధించాల్సి ఉంది. సంయమనంతో ఆడుతూ అనుకున్న వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మిడ్ ఫీల్డర్లు రాణిస్తున్నా... ఫార్వర్డ్స్ ఫినిషింగ్ మాత్రం చేయలేకపోతున్నారు’ అని భారత జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. మరో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాతో బెల్జియం తలపడుతుంది.
 
 సెమీస్‌లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా
 బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ 2-0 గోల్స్ తేడాతో కెనడాను ఓడించగా... ఆస్ట్రేలియా 3-1తో జర్మనీపై గెలిచి సెమీఫైనల్స్‌కు చేరాయి.
 

>
మరిన్ని వార్తలు