ఆస్ట్రేలియానే ఫేవరెట్

18 Mar, 2016 00:24 IST|Sakshi

సంజయ్ మంజ్రేకర్
తమ గ్రూపులో జరుగుతున్న పరిణామాలపై ఆస్ట్రేలియా జట్టు సంతోషంలో మునిగి ఉంటుంది. టి20 ఫార్మాట్‌లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టును సొంత గడ్డపైనే న్యూజిలాండ్ ఓడించింది. ఈ ఫార్మాట్‌లో కివీస్ ఆటతీరు తెలిసిన వారికి షాక్ కలిగించిన ఫలితం అది. ఇక బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా అద్భుత బ్యాటింగ్‌తో గెలిచింది. నిజానికి వారి బలమంతా బౌలింగే. ఇది ఆసీస్ గమనించే ఉంటుంది. హఫీజ్, షెహజాద్ బ్యాటింగ్ తీరుతో పాక్‌పై ఉన్న అనుమానాలు తేలిపోయాయి. దీంతో 19న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌ను భారత్ కాస్త జాగ్రత్తగానే ఆడాల్సి ఉంది. పొట్టి ఫార్మాట్‌ను మనం ధనాధన్ క్రికెట్‌గానే చూస్తాం.

ఇతర ఫార్మాట్లలాగా ఇక్కడ టాస్, పిచ్, మైదానం పరిస్థితులు ఏవీ ప్రభావితం చూపవనుకుంటాం. కానీ ఈ పరిస్థితిని నాగ్‌పూర్ పిచ్ మార్చి భారత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈడెన్‌లో మంచుతో కూడిన పిచ్ కూడా విండీస్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా మారింది. అయితే వాతావరణం సరిగా ఉంటే ఆసీస్, కివీస్ మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ పెద్దగా నిర్ణాయకం కాకపోవచ్చు. ఇదే జరిగితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా చెప్పవచ్చు.

భారత్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంట్లో భాగంగా వారి స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్ కలిపి 29 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. టి20 పరంగా చూస్తే ఇవి అద్భుతమైన గణాంకాలు. అయితే ధర్మశాలలో పిచ్ స్వభావరీత్యా వీరు ఇలాంటి ప్రదర్శనే ఇస్తారని ఆశించలేము. అందుకే ఆసీస్‌కు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు