విజయంతో ముగించారు

29 Jan, 2018 04:58 IST|Sakshi

ఐదో వన్డేలో ఆసీస్‌పై ఇంగ్లండ్‌ గెలుపు

సిరీస్‌ 4–1తో కైవసం

పెర్త్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో 0–4తో ఓటమి పాలైన ఇంగ్లండ్, వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం హోరాహోరీగా జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 12 పరుగులతో విజయం సాధించి 4–1తో సిరీస్‌ చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాసన్‌ రాయ్‌ (49; 7 ఫోర్లు, 1 సిక్స్‌), బెయిర్‌స్టో (44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్‌ హేల్స్‌ (35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (62; 2 ఫోర్లు) రాణించారు. ఆసీస్‌ బౌలర్లో ఆండ్రూ టై ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. స్టొయినిస్‌ (87; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... మ్యాక్స్‌వెల్‌ (34; 3 ఫోర్లు, ఒక సిక్స్‌), పైన్‌ (34; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో ఆసీస్‌ 189/4తో పటిష్టంగా కనిపించినా... ఇంగ్లండ్‌ పేసర్‌ కరన్‌ (5/35) విజృంభించడంతో ఆసీస్‌ జట్టు 58 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. మరో బౌలర్‌ మొయిన్‌ అలీకి 3 వికెట్లు దక్కాయి. కరన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... జో రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 

మరిన్ని వార్తలు