ఆసీస్‌ రికార్డు స్కోరు

31 Mar, 2018 11:37 IST|Sakshi

ముంబై: మహిళల ముక్కోణపు టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు రికార్డు స్కోరు సాధించింది. శనివారం ఇంగ్లండ్‌తో తుది పోరులో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్‌ బ్రేక్‌ చేసింది.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్‌ నాల్గో బంతికి ఓపెనర్‌ బెత్‌ మూనీ డకౌట్‌గా పెవిలియన్‌ చేరారు. ఆపై అలైస్సా హేలీ(33), గార్డనర్‌(33)లు కుదురుగా బ్యాటింగ్‌ చేసి జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ తడబడినట్లు కనిపించింది.కాగా, కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌(88 నాటౌట్‌;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 139 పరుగులు జోడించడంతో ఆసీస్‌ రెండొందల మార్కును సునాయసంగా దాటడంతో పాటు రికార్డు స్కోరును నమోదు చేసింది.

మరిన్ని వార్తలు