ముగిసిన మూడో రోజు ఆట.. రేపు ఎక్స్‌ట్రా టైమ్‌

5 Jan, 2019 12:43 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను సుమారు గంటన్నర ముందుగానే నిలిపేశారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 236/6 పరుగులు చేసింది. మూడో రోజు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ ఆసీస్‌ విలవిల్లాడింది. దీంతో మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. హ్యాండ్‌స్కాంబ్‌(28 బ్యాటింగ్‌), ప్యాట్‌ కమిన్స్‌( 25 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో కుల్దీప్‌ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ దక్కింది. తొలుత మ్యాచ్‌ను వెలుతురు లేమి కారణంగా నిలిపివేయగా, ఆపై వర్షం పడింది. దాంతో మూడో రోజు ఆట పూర్తిగా జరగలేదు.

అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7  వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించింది. ప్రస్తుతం ఆసీస్‌ 386 పరుగులు వెనుకబడి ఉంది.  కాగా, ఆసీస్‌ ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే ఇంకా 187 పరుగులు చేయాలి. ఆదివారం నాల్గో రోజు ఆట ముందుగానే ప్రారంభం కానుంది.  భారత్‌ కాలమాన ప్రకారం ఉదయం గం.04.30 ని.లకు మ్యాచ్‌ను ఆరంభించనున్నారు. మూడో రోజు ఆటను ముందుగానే మ్యాచ్‌ నిలిపివేయాల్సి రావడంతో నాల్గో రోజు ఆటకు ఎక్స్‌ట్రా టైమ్‌ను కేటాయించారు.

>
మరిన్ని వార్తలు