అలా చేయొద్దని బుమ్రాకు చెప్పా : వార్నర్‌

15 Jan, 2020 13:51 IST|Sakshi

ముంబై : భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 50 వ ఓవర్‌ మొదలవుతుందనగా  గాలిపటం మైదానంలో పడింది. స్పైడర్‌కెమెరాకు చిక్కుకుంది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు సంశయించాడు. దాంతో క్రీజులో ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా గాలిపటం​ దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు. ఈక్రమంలో అది ఏ పేద పిల్లాడి గాలిపటమోనని, దానిని  చించొద్దని బుమ్రాతో అన్నాడట. ఇదే విషయాన్ని పోస్ట్‌ మ్యాచ్‌ మీడియా సమావేశం అనంతరం వార్నర్‌ చెప్పాడు.
(చదవండి : బుమ్రా బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : వార్నర్‌)

‘గాలి పటాల పండుగ జరుగుతోందని విన్నాను. చాలా వింతగా అనిపించింది. స్పైడర్‌క్యామ్‌లో చిక్కుకున్న గాలిపటాన్ని చూసి కంగారు పడ్డా. అది ప్రమాదకరమైందేమోనని భావించా. క్రీజులో ఉన్న బుమ్రా వెంటనే దారాన్ని తెంచి తొలగించాడు. అయితే, బుమ్రా దానిని తొలగిస్తున్న సమయంలో.. అది ఏ పేద పిల్లాడి గాలిపటం కావొచ్చునని.. చించొద్దని చెప్పా. ఈ ఘటన కొత్తగా అనిపించింది’అని వార్నర్‌ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘరో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్‌కాగా.. వికెట్‌ నష్టపోకుండా ఆసిస్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (112 బంతుల్లో 128 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ (114 బంతుల్లో 110 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయారు.
(చదవండి : పది వికెట్ల పరాభవం)

మరిన్ని వార్తలు