చావో రేవో తేల్చుకుంటాం: స్మిత్‌

6 Jun, 2017 20:31 IST|Sakshi
చావో రేవో తేల్చుకుంటాం: స్మిత్‌

లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ తో జరిగే చావో రేవో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. టోర్నీలో ఆసీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దవ్వడంతో ఆసీస్‌కు క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. గ్రూప్‌-ఏ లో మిగిలిన ఇంగ్లండ్‌ మ్యాచ్‌ చావో రేవో అన్నట్లుగా మారింది.రెండు పాయింట్లతో ఉన్న ఆసీస్‌ టోర్నీ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పని సరిగా గెలవాల్సిందే. ఆడిన రెండు మ్యాచుల్లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించడంతో స్మిత్‌ అసహనం వ్యక్తం చేశాడు.

శనివారం ఇంగ్లండ్‌ తో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు రాణిస్తారని స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ను ఎదుర్కోనేందుకు తమ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని, బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉందని  స్మిత్‌ నొక్కి చెప్పాడు. మా జట్టు ఆటగాళ్లు గత కొద్ది రోజులుగా మంచి క్రికెట్‌ ఆడారని, ఐపీఎల్‌ లాంటి టోర్నిలతో ఫామ్‌లోకి వచ్చారని, ఇదే మా జట్టును ముందుకు తీసుకువెళ్తుందని స్మిత్‌ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్లు రాణించారని, ఇదే ఊపుతో ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తామన్నాడు.బంగ్లాపై 4 వికెట్లు తీసిన స్టార్క్‌ను స్మిత్‌ కొనియాడాడు.

మరిన్ని వార్తలు