రెండో వన్డేలోనూ ఆసీస్ గెలుపు

6 Sep, 2015 01:42 IST|Sakshi
రెండో వన్డేలోనూ ఆసీస్ గెలుపు

లండన్ : ‘యాషెస్’ టెస్టు సిరీస్‌లో నిరాశపర్చిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో దుమ్మురేపుతోంది. కెప్టెన్ స్మిత్ (87 బంతుల్లో 70; 7 ఫోర్లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో శనివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూల జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 7 వికెట్లకు 309 పరుగులు చేసింది.

స్మిత్, బెయిలీ (72 బంతుల్లో 54; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (38 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 245 పరుగులకే పరిమితమైంది. మోర్గాన్ (87 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. టేలర్ (43), రాయ్ (31) మోస్తరుగా ఆడారు. ఓ దశలో 142 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను చివర్లో ఆసీస్ బౌలర్లు మరింత బెంబెలేత్తించారు. దీంతో 103 పరుగుల తేడాతో ఆఖరి ఐదు వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. కమిన్స్‌కు 4, మ్యాక్స్‌వెల్‌కు 2 వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు