కోతి కాటు.. వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌!

30 Jan, 2020 14:00 IST|Sakshi

పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా):  దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్‌ జాక్‌ ఫ్రాసర్‌ మెక్‌ గర్క్‌ వైదొలిగాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌  క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమి పాలుకాగా, ఐదో స్థానం కోసం ప్లే ఆఫ్‌ సెమీ ఫైనల్‌-2 ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మెక్‌ గర్క్‌ దూరమైన విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ధృవీకరించింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందే అతన్ని కోతి కరిచినా దాన్ని సీరియస్‌గా తీసుకోపోవడంతో బరిలోకి దిగాడు. భారత్‌తో మ్యాచ్‌లో డైమండ్‌ డక్‌గా మెక్‌ గర్క్‌ నిష్క్రమించాడు. కనీసం బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. (ఇక్కడ చదవండి: సెమీస్‌లో యువ భారత్‌)

వారం రోజుల క్రితం ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత బయటకు వెళ్లిన మెక్‌ గర్క్‌ను కోతి కరిచింది. దీనికి జట్టు మెడికల్‌ వైద్య బృందం చికిత్స చేయడంతో భారత్‌తో మ్యాచ్‌లో ఆడాడు. కాగా, ఏడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉండటంతో మెక్‌ గర్క్‌ తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఫలితంగా ఆసీస్‌తో జట్టుకు దూరమయ్యాడు. చికిత్స తర్వాత మెక్‌ గర్క్‌ అందుబాటులో ఉండాడని సీఏ తెలిపింది. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-1లో భారత్‌ 74 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేయగా, తర్వాత ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. 


 

మరిన్ని వార్తలు