పాక్‌కు ఆసీస్‌ ఝలక్‌!

10 Feb, 2019 19:43 IST|Sakshi

కరాచీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుతో కనీసం రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో ఆడించాలనుకున్న పీసీబీకి నిరాశ తప్పలేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భాగంగా తమ దేశంలో రెండు మ్యాచ్‌లు ఆడాలంటూ పీసీబీ చేసిన విజ్ఞప్తిని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తిరస్కరించింది. పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదనే ప్రభుత్వ సూచనతో వెనక్కి తగ్గినట్లు సీఏ వెల్లడించింది. దీనిపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు పీసీబీ డైరెక్టర్‌ జకీర్‌ ఖాన్‌ తెలిపారు. ‘ ఇది పాకిస్తాన్‌ క్రికెట్‌ ఫ‍్యాన్స్‌ను నిరాశకు గురి చేసే వార్తే. ఆసీస్‌తో పాక్‌లో మ్యాచ్‌లో జరగాలంటే మరికొంత సమయం పట్టేచ్చేమో. అప్పటవరకూ నిరీక్షణ తప్పదు’ అని జకీర్‌ పేర్కొన్నారు. 

కాగా, ఇరు జట్ల మధ్య యూఏఈ వేదికగా ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది. ఇందులో తొలి రెండు వన్డేలో షార్జాలో జరుగుతుండగా, మూడో వన్డే అబుదాబిలో జరుగనుంది. ఇక నాలుగు, ఐదు వన్డేలు దుబాయ్‌లో జరుగుతాయి. వచ్చే నెల 22వ తేదీ నుంచి 31 వరకూ ఇరు దేశాల మధ్య ఈ సిరీస్‌ జరుగతుంది.  2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ జట్టు కూడా అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. పాకిస్తాన్‌ భద్రతపరంగా ధీమా ఇస్తున్నా కానీ కొన్ని పెద్ద దేశాలు మాత్రం అక్కడ క్రికెట్‌ ఆడటానికి మొగ్గుచూపడం లేదు. కొన్ని ఆడపా దడపా సిరీస్‌లు పాకిస్తాన్‌లో జరిగినా ప్రధాన దేశాలతో సిరీస్‌లు ఆడాలన్న పీసీబీ కల మాత్రం తీరడం లేదు. 

మరిన్ని వార్తలు