అవధ్‌ వారియర్స్‌ రెండో గెలుపు

29 Jan, 2020 02:27 IST|Sakshi

పీబీఎల్‌ ఐదో సీజన్‌  

లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో అవధ్‌ వారియర్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ 5–0తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. తొలుత జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కొ సుంగ్‌ హ్యూన్‌–క్రిస్టినా పెడర్‌సెన్‌ (అవధ్‌ వారియర్స్‌) 9–15, 14–15తో కిమ్‌ స రంగ్‌–పియా జెబదియా (ముంబై) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో ఆడిన అవధ్‌ వారియర్స్‌ ప్లేయర్‌ బీవెన్‌ జాంగ్‌ 15–3, 15–4తో కుహూ గార్గ్‌ (ముంబై)పై గెలిచి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చింది.

పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో బరిలో దిగిన పారుపల్లి కశ్యప్‌ (ముంబై) 8–15, 10–15తో విన్సెంట్‌ (అవధ్‌ వారియర్స్‌) చేతిలో ఓడటంతో... ముంబై జట్టుకు ఒక పాయింట్‌ పెనాల్టీ పడింది. దాంతో అవధ్‌ వారియర్స్‌ 3–0తో ఆధిక్యంలో నిలిచింది.తర్వాత జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ (అవధ్‌ వారియర్స్‌) 12–15, 15–6, 15–7తో లీ డాంగ్‌ కెయున్‌ (ముంబై)పై గెలిచాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్‌ హ్యూన్‌– షిన్‌ బేక్‌ (అవధ్‌ వారియర్స్‌) జంట 14–15, 15–10, 15–14తో కిమ్‌ జి జుంగ్‌–కిమ్‌ స రంగ్‌ (ముంబై) జోడీపై గెలిచింది. నేటి నుంచి హైదరాబాద్‌ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడుతుంది.

>
మరిన్ని వార్తలు