అవినాశ్‌కు 13వ స్థానం

5 Oct, 2019 03:52 IST|Sakshi

3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మరో జాతీయ రికార్డు

టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం రాకున్నా మరో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కింది. శుక్రవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే 13వ స్థానంలో నిలిచాడు. 16 మంది పాల్గొన్న ఫైనల్లో అవినాశ్‌ 8ని:21.37 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. ఇదే టోరీ్నలో క్వాలిఫయింగ్‌లో 8ని:25.23 సెకన్లతో సాధించిన జాతీయ రికార్డును అవినాశ్‌ బద్దలు కొట్టాడు.

కిప్‌రుటో (కెన్యా–8ని:01.35 సెకన్లు) స్వర్ణం... లమేచా గిర్మా (ఇథియోపియా–8ని:01.36 సెకన్లు) రజతం... సుఫియాన్‌ ఎల్‌ బకాలి (మొరాకో–8ని:03.76 సెకన్లు) కాంస్యం సాధించారు.  పురుషుల 1500 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్, ఆసియా క్రీడల చాంపియన్‌ జిన్సన్‌ జాన్సన్‌ ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. తొలి రౌండ్‌ హీట్‌లో పోటీపడ్డ జాన్సన్‌ 3 నిమిషాల 39.86 సెకన్లలో గమ్యానికి చేరి తన హీట్‌లో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో 43 మంది పాల్గొనగా... జాన్సన్‌ 34వ స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు