సాక్షి, దంబుల్లా: యువరక్తంతో ఉన్న ప్రస్తుత టీమిండియా జట్టు 2019లో ప్రపంచకప్ గెలుస్తుందని యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏడు నెలల అనంతరం జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అక్షర్ మూడు వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు జస్ప్రీత్ బుమ్రాతో ఈ యువ క్రికెటర్ సరదాగా ముచ్చటించాడు.
‘చాల రోజుల తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. కానీ జట్టులో అవకాశం లభించలేదని ఎప్పుడు దిగులు చెందలేదు. శ్రీలంక బ్యాట్స్మన్ దాటిగా ఆడుతున్నప్పుడు బౌలింగ్ అవకాశం వచ్చింది. నేను కుదురుకోవడానికి రెండు ఓవర్లు వేయాల్సి వచ్చింది. అనంతరం ఖచ్చితంగా వికెట్ తీయాలనుకున్నా అలాగే నాకు తొలి వికెట్ దక్కింది.’ అని గేమ్ ప్లానింగ్ గురించి బుమ్రా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్షర్ చెప్పుకొచ్చాడు.
ఇక శిఖర్ ధావన్ను కొనియాడిన ఈ యువ బౌలర్ ఒక్కరి మీద ఆధారపడకుండా సమీష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధించామన్నాడు. జట్టులో ఆటగాళ్లందరూ 25 నుంచి 27 మధ్య వయస్సు వారే ఉన్నారు. అంతే కాకుండా జట్టు ఐక్యంగా ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తుంది. 2019 వరల్డ్కప్ ఈ యవ జట్టుదే అని అక్షర్ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో భారత్ రెండో వన్డే గురువారం పల్లెకలెలో ఆడనుంది.