ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!

27 Jun, 2019 16:02 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. రోహిత్‌ శర్మ 1 ఫోర్‌, 1 సిక్స్‌తో మంచి టచ్‌లోకి వచ్చిన సమయంలో వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్‌ రోచ్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతి రోహిత్‌ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్‌ షాయ్‌ హోప్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్‌ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్‌ రివ్యూ కోరగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.

ఆ బంతిని డీఆర్‌ఎస్‌ ద్వారా సమీక్షించే క్రమంలో కొద్దిపాటి స్పైక్‌ కనబడింది. అయితే అది బంతికి తగిలిందా.. ప్యాడ్‌కు తగిలిందా అనే దానిపై క్లారిటీ లేదు. బ్యాట్‌కు, ప్యాడ్‌కు అత్యంత సమీపంగా వెళ్లడంతో ఆ స్పైక్‌ కనిపించింది. దాంతో ఔట్‌గా ప్రకటించాడు థర్డ్‌ అంపైర్‌. కనీసం ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి కూడా వదలకుండా నేరుగా ఔట్‌ ప్రకటించాడు. దాంతో రోహిత్‌ భారంగా పెవిలియన్‌ చేరాడు. అతను పెవిలియన్‌కు చేరే క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా. అదే సమయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు సైతం తప్పుబడుతున్నారు. ఆ ఔట్‌పై క్లియరెన్స్‌ లేనప్పుడు ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికైనా వదిలేయాలి లేదా బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వాలి కదా అని మండిపడుతున్నారు. ప్రధానంగా డీఆర్‌ఎస్‌ ఉన్నది ఇందుకేనా అంటూ విమర్శిస్తున్నారు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో రోహిత్‌ 18 పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో 29 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది.


 

>
మరిన్ని వార్తలు