సింధూపై ప్రశంసలు కురిపించిన ఉపరాష్ట్రపతి

31 Aug, 2019 18:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశం ఖ్యాతిని సింధూ ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. కుటుంబంతో కలిసి సింధూ ఉపరాష్ట్రపతిని హైదరాబాద్‌లో శనివారం కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధూ కొత్త చరిత్ర లిఖించారని వెంకయ్య అన్నారు. ఆమె సాధించిన విజయాలు, కఠోర శ్రమ యువతకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. సింధూలాంటి అథ్లెట్లు దేశ యువతకు రోల్స్‌మోడల్స్‌గా నిలుస్తారని చెప్పారు. కఠినమైన ఆహార నియమాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు ఆమెకు దోహదం చేశాయని వ్యాఖ్యానించారు.


(చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం)

హెల్తీ అయితే దేశం వెల్తీ అవుతుంది..
ఇక జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ జాతీయోద్యమంగా ముందుకు సాగాలని వెంకయ్య ఆకాక్షించారు. ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. ఆహార పద్ధతుల్లో మార్పులు, వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చని సూచించారు. ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారని, వారంతా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు. ఆరోగ్యం ఉండటం మాత్రమే కాకుండా ఫిట్‌గా ఉంటేనే లక్ష్యాల్ని సాధింంచగులుగుతామన్నారు. దేశం హెల్తీగా ఉంటేనే వెల్తీగా మారుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు