బెంగళూరు రాప్టర్స్‌ గెలుపు

11 Jan, 2019 02:22 IST|Sakshi

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌ 3–2తో చెన్నై స్మాషర్స్‌పై గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్‌ అహ్‌సాన్‌– సథియావాన్‌ (బెంగళూరు) జంట 15–14, 9–15, 11–15తో క్రిస్‌ అడ్‌కాక్‌– చిన్‌ చుంగ్‌ జోడీ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో ప్రణీత్‌ (బెంగళూరు) 15–11, 15–12తో కశ్యప్‌పై గెలుపొందడంతో స్కోరు 1–0గా మారింది.

బెంగళూరు ట్రంప్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 15–10, 15–10తో వీ ఫెంగ్‌ చోంగ్‌ (చెన్నై)పై గెలుపొందడంతో బెంగళూరు 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో థి త్రాంగ్‌వు 10–15, 15–14, 10–15తో సుంగ్‌ జీ హ్యూన్‌ (చెన్నై) చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎలిస్‌– స్మిత్‌ జంట 8–15, 15–12, 4–15తో క్రిస్‌ అడ్‌కాక్‌– గాబ్రియెల్‌ అడ్‌కాక్‌ (చెన్నై) జోడీ చేతిలో ఓడినప్పటికీ 3–2తో విజయం బెంగళూరు వశమైంది. నేడు జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌తో బెంగళూరు రాప్టర్స్‌ తలపడుతుంది.    

మరిన్ని వార్తలు