సెలక్టర్లకు సంజయ్‌ బంగర్‌ బెదిరింపు!

4 Sep, 2019 16:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపికతో పాటు సహాయక సిబ్బంది ఎంపిక కూడా జరిగిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తూ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ సలహా కమిటీ నిర్ణయం తీసుకోగా, సహాయక సిబ్బందిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే బ్యాటింగ్‌ కోచ్‌గా తనను తప్పించడంపై సంజయ్‌ బంగర్‌ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయడానికి మొగ్గుచూపిన సమయంలో బంగర్‌ కాస్త అతి చేసినట్లు తెలుస్తోంది. 

ఏకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. తన మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారంటూ బంగర్‌ దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. సంజయ్‌ బంగర్‌కు మరోసారి అవకాశం ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి.

మరిన్ని వార్తలు