బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్

23 Apr, 2015 01:04 IST|Sakshi
బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్

పాక్‌పై 3-0తో సిరీస్ సొంతం
 సౌమ్య సర్కార్ సెంచరీ

మిర్పూర్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తమ క్రీడా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ సౌమ్య సర్కార్ సూపర్ సెంచరీ (110 బంతుల్లో 127 నాటౌట్; 13 ఫోర్లు; 6 సిక్సర్లు) సహాయంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ దెబ్బతో పాక్ జట్టు తమ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడు నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 49 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
 
  కెప్టెన్ అజహర్ అలీ (112 బంతుల్లో 101; 10 ఫోర్లు) సెంచరీ చేయగా... హరిస్ సోహైల్ (58 బంతుల్లో 52; 1 ఫోర్; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 39.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్ (76 బంతుల్లో 64; 8 ఫోర్లు; 1 సిక్స్) తొలి వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత ముష్ఫికర్ (43 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు) అండతో సర్కార్ మూడో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు.
 

 


 

>
మరిన్ని వార్తలు