టెస్టు చరిత్రలోనే అరుదైన రికార్డు

2 Feb, 2018 17:01 IST|Sakshi

చిట్టగాంగ్ : టెస్టు క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. శ్రీలంకతో​ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 513 పరుగులు చేసింది. ఈ పరుగుల్లో ఒక్కటంటే ఒక్క బై కానీ, లెగ్‌ బై నుంచి వచ్చిన పరుగులు లేకపోవడం విశేషం. టెస్టు క్రికెట్‌లో బంగ్లాకు ఇది ఐదో అత్యధిక స్కోరు కాగా.. 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి  494 పరుగులు చేసింది. ఈ స్కోరులో కూడా బై, లెగ్‌బై నుంచి ఒక్క పరుగు రాలేదు. ఇలా ఇప్పటి వరకు ఈ రికార్డే కొనసాగగా తాజా స్కోర్‌తో బంగ్లాదేశ్‌ అధిగమించింది. 

ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 504 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (196) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా ధనంజయ డి సిల్వా 173 పరుగులు చేశాడు. రోషన్ సిల్వా 87, కెప్టెన్ దినేష్ చండీమల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు