క్వార్టర్స్కు చేరడంపై బంగ్లాదేశ్ కోచ్
మెల్బోర్న్: ఎవరికో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం బంగ్లాదేశ్కు లేదని, బాగా ఆడినందుకే క్వార్టర్స్కు వచ్చామని ఆ జట్టు కోచ్ హతురసింఘ అన్నారు. జట్టులో ఆటగాళ్లంతా ఆత్మవిశ్వాసంతో భారత్తో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగుతారని చెప్పారు. ‘మా జట్టులో క్రికెటర్లంతా ఫామ్లో ఉన్నారు. ఎవరికీ గాయాల బెడద లేదు. తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప ఘనత. క్రికెట్లో రికార్డులు, చరిత్రల కంటే ఆ రోజు బాగా ఆడటమే ముఖ్యం. భారత జట్టు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పేస్ విభాగం చక్కగా రాణిస్తోంది. మా బలానికి తగ్గట్లుగా రాణించడంపైనే మా దృష్టి’ అని హతురసింఘ చెప్పారు.