విండీస్‌ విలవిల

20 Dec, 2018 21:10 IST|Sakshi

మిర్పూర్‌: వెస్టిండీస్‌కు బంగ్లాదేశ్‌ షాక్‌ ఇచ్చింది. విండీస్‌తో జరిగిన రెండో టీ20లో బంగ్లా భారీ విజయం సాధించింది. కరేబియన్లను 36 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 5 వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని శాసించిన షకీబ్‌ బ్యాట్‌తోనూ రాణించాడు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌(60) అర్ధ సెంచరీకి.. షకీబ్‌ (42; 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌), మహ్మదుల్లా(43; 21 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపులు తోడవడంతో బంగ్లా భారీ స్కోరు చేసింది.

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌.. షకీబ్‌ దెబ్బకు 19.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోవ్‌మన్‌ పావెల్‌ (50) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. షకీబ్‌ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. షకీబ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’  అందుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో విండీస్‌ గెలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్‌ సమం చేసింది. 

మరిన్ని వార్తలు