భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

29 Sep, 2015 00:01 IST|Sakshi
భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ 36/2
బెంగళూరు: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్‌పై భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించగా... మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు.
 
రాణించిన శంకర్, నాయర్: ఓవర్‌నైట్ స్కోరు 161/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శిఖర్ ధావన్ (146 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) తన జోరు కొనసాగించగా, ఆ తర్వాత విజయ్ శంకర్ (110 బంతుల్లో 86; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (97 బంతుల్లో 71; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో జుబేర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ వ్యవధిలో అనాముల్ (0), సర్కార్ (19) వికెట్లు కోల్పోయింది. ఈశ్వర్ పాండే, జయంత్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది.

మరిన్ని వార్తలు