కొత్త పేసర్‌కు స్థానం

17 Apr, 2019 01:04 IST|Sakshi

అబు జాయెద్‌కు చోటు

ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌  జట్టు ప్రకటన  

ఢాకా: పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్న వేళ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. గతేడాది ఆసియా కప్‌ ఆడిన మొసద్దిక్‌ హుస్సేన్‌ పునరాగమనం చేయగా... అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేయని యువ పేస్‌ బౌలర్‌ అబు జాయెద్‌ను తొలిసారి ఎంపిక చేశారు. 25 ఏళ్ల అబు ఇప్పటికే ఐదు టెస్టులు ఆడి 11 వికెట్లు... మూడు టి20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.  పేసర్లు ముస్తఫి జుర్‌ రెహమాన్, రూబెల్‌ హుస్సేన్‌ గాయాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో అబు జాయె ద్‌ బ్యాకప్‌ బౌలర్‌గా పనికొచ్చే అవకాశముంది. 15 మంది సభ్యులుగల జట్టుకు మష్రఫె మొర్తజా నేతృత్వం వహిస్తాడు. ఈ జట్టులో నలుగురు ఆటగాళ్లు మొర్తజా, తమీమ్‌ ఇక్బాల్, షకీబ్‌ అల్‌ హసన్, ముష్ఫికర్‌ రహీమ్‌లకు మూడు వరల్డ్‌ కప్‌లు ఆడిన అనుభవం ఉంది. 

బంగ్లాదేశ్‌ జట్టు: మొర్తజా (కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్, లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్‌ రహీమ్, మహ్ముదుల్లా, షకీబ్‌ అల్‌ హసన్, మొహమ్మద్‌ మిథున్, షబ్బీర్‌ రెహమాన్, మొసద్దిక్‌ హుస్సేన్, సైఫుద్దీన్, మెహదీ హసన్, రూబెల్‌ హుస్సేన్, ముస్తఫిజుర్‌ రెహమాన్, అబు జాయెద్‌.    

మరిన్ని వార్తలు