‘ఈ విజయం చాలా గొప్పది.. మనవాళ్లు అదరగొట్టారు..’

14 Feb, 2018 11:40 IST|Sakshi
బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా

టీమిండియా ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 4-1తో సొంతం చేసుకుంది. పోర్ట్‌ఎలిజబెత్‌లో మంగళవారం ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్‌ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మన క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం చాలా గొప్పది అని అన్నారు. 

‘ఇండియా సారథి విరాట్‌ కోహ్లి, మిగతా ఆటగాళ్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. ఏ జట్టునైనా వారి స్వదేశలంలో ఓడించే సామర్ధ్యం ఇండియా జట్టుకు ఉందని ఈ విజయంతో నిరూపించారు. 25 సంవత్సరాల తర్వాత ‍ వారు భారత్‌కు సిరీస్‌ సాధించండం​ దేశానికి గర్వకారణం’ అని సీకే ఖన్నా ఇండియా క్రికెటర్లను కొనియాడారు.

దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మొదట నుంచి విఫలం చెందిన రోహిత్‌ ఐదో వన్డేలో  సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ను(126 బంతుల్లో; 115 పరుగులు) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  అవార్డు వరించింది. వన్డే కెరీర్‌లో రోహిత్‌కు 17వ సెంచరీ. సౌతాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా(71పరుగులు) ఒక్కడే పోరాడాడు. జట్టును విజయం వైపు నడిపిస్తున్న ఆమ్లాను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో రన్‌ అవుట్‌ చేశాడు. ఇండియా బౌలర్లలో  కుల్దీప్‌ యాదవ్‌కు 4 వికెట్లు, హర్ధిక్‌ పాండ్యాకు 2 వికెట్లు, చాహల్‌కు 2 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కాయి. ఈ విజయంతో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. 

మరిన్ని వార్తలు