బీసీసీఐ ఏజీఎం 29న

2 Sep, 2013 01:48 IST|Sakshi
బీసీసీఐ ఏజీఎం 29న

కోల్‌కతా: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షత వ హిస్తాడా? లేదా? అనే సస్పెన్స్ తొలగింది. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఆయన స్వచ ఛందంగా  వెనక్కి తగ్గారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియానే కమిటీకి నేతృత్వం వహించారు.
 
  బోర్డు అధ్యక్షుడిగా ఉన్నా వర్కింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించలేని అరుదైన పరిస్థితి శ్రీనివాసన్ ఎదుర్కొన్నారు. అల్లుడు గురునాథ్ బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కోవడంతో ఆయన అధ్యక్షత బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈ సమావేశానికి ఆయన తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదా లో హాజరయ్యారు. అలాగే బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఈనెల 29న చెన్నైలో జరిపేందుకు నిర్ణయించారు. అంతవరకు బోర్డు రోజువారీ వ్యవహారాలు దాల్మియాకే అప్పగించారు.
 
 ఏజీఎంకు నేనే అధ్యక్షత వహిస్తా: శ్రీనివాసన్
 ఈనెల 29న జరిగే వార్షిక సాధారణ సభ్య సమావేశానికి (ఏజీఎం) తానే అధ్యక్షత వహిస్తానని శ్రీనివాసన్ తేల్చి చెప్పారు. వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో ఈ విషయం తెలిపారు. ‘ఏజీఎంకు నేను అధ్యక్షత వహిస్తాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అసలు సమస్యేమిటో నాకు అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చే శానా? నాపైన ఏమైనా ఆరోపణలున్నాయా? లేక కేసులున్నాయా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ రద్దవుతుందని చెప్పలేదని, కమిటీలో చర్చకు రాకపోయినా ఆ సిరీస్ ఉంటుందని తేల్చారు.
 
  చట్టబద్ధమైన బాధ్యతలు శ్రీనివాసన్‌కే..
 బీసీసీఐ అధ్యక్షుడిగా ఇంకా పూర్తిస్థాయిలో విధులు చేపట్టకపోయినా బోర్డు రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధమైన బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తూ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. అలాగే 29న జరిగే ఏజీఎంకు హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించారు. ‘ఏజీఎం వరకు బోర్డు అధ్యక్షుడికి ఉండే రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధ బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తున్నట్టు తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సభ్యులకు తెలిపారు.
 
 అలాగే అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏజీఎంకు హాజరుకావాలనికమిటీ కోరింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. వచ్చే జనవరిలో కివీస్ పర్యటనను, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంగ్లండ్ పర్యటనను ఆమోదించారు. స్పాట్ ఫిక్సింగ్‌పై బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ ఇచ్చిన నివేదికపై ఈనెల 13న బోర్డు క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది.
 

మరిన్ని వార్తలు