భారత క్రికెటర్ల సంఘం కూడా...

24 Jul, 2019 07:57 IST|Sakshi

బీసీసీఐ ఆమోద ముద్ర   

న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత క్రికెట్‌లోనూ ఆటగాళ్ల కోసం ప్రత్యేక సంఘం సిద్ధమైంది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి బోర్డు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ‘కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్‌ క్రికెటర్ల అసోసియేషన్‌ను బీసీసీఐ అధికారికంగా గుర్తిస్తోంది. ఇది మినహా మరే సంఘానికి కూడా బోర్డు గుర్తింపు ఉండదు’ అని బీసీసీఐ ప్రకటించింది. ఈ సంఘానికి బోర్డు ఆరంభంలో కొంత మొత్తం నిధులు అందజేస్తుందని... అయితే ఆ తర్వాత మాత్రం సొంత ఆదాయమార్గాలు చూసుకోవాలని కూడా బోర్డు సూచించింది. ఐసీఏకు ఎన్నికలు నిర్వహించే వరకు కపిల్‌ దేవ్, అజిత్‌ అగార్కర్, శాంత రంగస్వామి డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈ సంఘంలో మాజీ క్రికెటర్లకు మాత్రమే సభ్యత్వం ఇస్తారు. ప్రస్తుతం జాతీయ జట్లకు  ఆడుతున్న వారు సభ్యత్వానికి అనర్హులు. ఇతర దేశాల్లో మాత్రం ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారికి కూడా సభ్యత్వం కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు