జీతాల్లో కోతలపై బీసీసీఐ క్లారిటీ

6 Jun, 2020 18:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఇప్పుడు కరోనా సెగ అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులకు సైతం తగిలింది. ఇప్పటికే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు క్రికెట్‌ బోర్డులు ఆటగాళ్లతో పాటు బోర్డు ఉద్యోగులు జీతాల్లోనూ కోతలు విధిస్తున్నాయి. ఇక ఎప్పుడు వేల కోట్ల లాభార్జనలతో క్రికెట్‌ ప్రపంచంలో విరాజిల్లుతున్న బీసీసీఐ పై కూడా కరోనా కారణంగా ఆర్థిక భారం ఎక్కువైంది. కరోనా కారణంగా జరగాల్సిన సిరీస్‌లన్ని రద్దు కావడం, మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్  నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐ కూడా నిధుల కొరతను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐ సుమారు రూ. 4000 కోట్లు నష్టపోనుంది. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ)

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం ఎలాంటి కోతలు లేకుండా అందరికి జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ట్రావెల్, వసతులు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం అంతకముందులా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు. ఉద్యోగులు, ఆటగాళ్ల జీతాల్లో కోతల గురించి దుమాల్‌ మాట్లాడుతూ, ‘బీసీసీఐ గత ఏడాది అక్టోబరు నుంచే ఖర్చుల్ని తగ్గించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతానికి ఆటగాళ్లు, ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయడం కానీ,  కోతలు కానీ లేవు. అయితే ట్రావెల్, వసతుల విషయంలో మాత్రం కాస్ట్ కటింగ్‌ని అమలు చేస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ సీజన్ రద్దయితే మాత్రం ఆ ప్రభావం బీసీసీఐపై తీవ్రంగా పడనుంది.  టోర్నీ రద్దు నిర్ణయాన్ని మాత్రం అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం’ అని అరుణ్ వెల్లడించాడు.

(విదేశాల్లో ఐపీఎల్-2020?)

మరిన్ని వార్తలు