బీసీసీఐ కీలక నిర్ణయాలు

19 Jul, 2015 17:24 IST|Sakshi
బీసీసీఐ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అక్రమాలకు పాల్పడ్డాయంటూ చెన్సై, రాజస్థాన్ జట్లతోపాటు ఆయా యజమానులపైనా నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలను బీసీసీఐ వెల్లడించింది. జస్టిస్ లోథా తీర్పు అనంతర పరిణామాలు, ఆటపై వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఓ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరిని సభ్యులుగా నియమించాలనే నిర్ణయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాకు వదిలేసింది. సదరు కమిటీ పని ప్రారంభించిన ఆరువారాలలోగా తన నివేదికను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు సమర్పించాల్సి ఉంటుంది. బీసీసీఐ వెల్లడించిన నిర్ణయాల్లో కొన్ని ముఖ్యాంశాలు..

  • జస్టిస్ లోథా కమిషన్ తీర్పును బీసీసీఐ సంపూర్ణంగా గౌరవిస్తున్నది. కమిషన్ నిర్దేశించిన అంశాలను ఆచరిస్తుంది.
  • క్రికెట్ ఉన్నతిని కాపాడాల్సిన అవసరాన్ని బీసీసీఐ గుర్తించింది. అందుకే కార్యాచరణ కమిటీ ఏర్పాటు
  • ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
  • లోథా కమిషన్ తీర్పును అధ్యయనం చేయడంతోపాటు ఐపీఎల్ లో చేపట్టవలసిన మార్పులపై ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఐపీఎల్ సలహా మండలితోనూ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.
  • ఆటకు సంబంధించి ఎవరుకూడా నష్టపోవద్దన్నదే మా అభిమతం
  • ఈ బృందం ఆరు వారాల్లోగ తన నివేదికను రూపొందించాలి.
  • నివేదిక పరిశీలన అనంతరం బీసీసీఐ వర్కింగ్ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు