9 ఆలౌట్‌... 9మంది సున్నా!

22 Feb, 2019 03:31 IST|Sakshi

మిజోరాం జట్టు చెత్త ప్రదర్శన

బీసీసీఐ మహిళల టి20 టోర్నీ  

పుదుచ్చేరి: ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌ అభివృద్ధి కోసం బీసీసీఐ తాపత్రయపడుతోంటే ఫలితాలు మాత్రం నానాటికీ తీసికట్టుగా ఉంటున్నాయి. పురుషుల క్రికెట్‌ కొంతలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... దేశవాళీ మహిళల క్రికెట్‌లో ఒకదానికి మించి మరోటి చెత్త ప్రదర్శనలు నమోదు అవుతున్నాయి. గతంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్‌ కేవలం 2 పరుగులకే ఆలౌట్‌ కాగా... నాగాలాండ్, మణిపూర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్లు నమోదు అయ్యాయి.

తాజాగా బీసీసీఐ సీనియర్‌ మహిళల టి20 టోర్నీలోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతం కావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల క్రికెట్‌ ‘జోక్‌’గా మారింది.  గురువారం మధ్యప్రదేశ్‌తో జరిగిన గ్రూప్‌ ‘ఈ’ మ్యాచ్‌లో మిజోరాం 13.5 ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఆలౌటైంది!  ఏకంగా 9 మంది బ్యాట్స్‌మెన్‌ ‘సున్నా’కే పరిమితమయ్యారు. అపూర్వ భరద్వాజ్‌ (25 బంతుల్లో 6; 1 ఫోర్‌) మాత్రమే పరుగుల ఖాతా తెరవగా, 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. తర్వాత మిజోరాం బౌలర్లు 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో... మధ్యప్రదేశ్‌ ఒక ఓవర్‌ మాత్రమే ఆడి 10 పరుగులు చేసి గెలిచింది.   

మరిన్ని వార్తలు