విదేశాల్లో ఐపీఎల్‌-2020? బీసీసీఐ సమాలోచన

5 Jun, 2020 10:59 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అనేక దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాలు శిక్షణ శిబిరాలు ప్రారంభించాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ దుమాల్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..   ‘సురక్షిత వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యమైతే మా తొలి ప్రాధాన్యత భారత్‌లోనే. కానీ పరిస్థితులు అనుకూలించకున్నా, ఈ ఏడాది క్రికెట్‌ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు మరో అవకాశం లేకపోతే విదేశాల్లో నిర్వహించేదానిపై ఆలోచిస్తాం’ అని అన్నారు. (సోషల్‌ మీడియాకు దూరంగా ధోని.. ఎందుకు?)

ఐపీఎల్‌ విదేశాల్లో నిర్వహించడం కొత్తేం కాదని గతంలో రెండు సార్లు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ రెండు దేశాల్లో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహించడం ఒక ప్రతిపాదన మాత్రమేనని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే నూటికి నూరు శాతం భారత్‌లోనే ఈ టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు అరుణ్‌ దుమాల్‌ తెలిపారు. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరిగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై జూన్‌ 10న ఐసీసీ తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జూన్‌ 10 తర్వాతనే ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలని సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.  (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’)

మరిన్ని వార్తలు