బీసీసీఐ జోక్యం చేసుకోదు

31 Mar, 2018 04:39 IST|Sakshi

షమీ భార్యకు స్పష్టం చేసిన బోర్డు అధ్యక్షుడు సీకే ఖన్నా  

ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్‌ మొహమ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్‌ సిరీస్‌లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు.

మరిన్ని వార్తలు