బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

22 Jul, 2019 21:04 IST|Sakshi

న్యూఢిల్లీ : క్రికెటర్లతో పాటు సతీమణి, ప్రియసఖిల ప్రయాణ విషయంలో బీసీసీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. సతీమణి, ప్రియసఖిల ప్రయాణలపై నిర్ణయాన్ని వెల్లడించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రధాన్‌ కోచ్‌ రవిశాస్త్రిలను సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) కోరడాన్ని బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎమ్‌ లోధా తప్పుబట్టారు. ప్రపంచకప్‌ సందర్భంగా నిబంధనలను అతిక్రమిస్తూ తన భార్యను వెంట ఉంచుకున్నాడని ఓ సీనియర్‌ క్రికెటర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు చెలరేగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటగాళ్ల మధ్య గొడవలని వచ్చిన కథనాలను పట్టించుకోనప్పుడు.. ఓ సీనియర్‌ ఆటగాడిపై వచ్చిన ఆరోపణలను ఇంత వేగంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించారు.

ఇక సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై వింతైన నివేదికలు రావడం బీసీసీఐ అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఆటగాళ్లతో సతీమణులను అనుమంతించే సమయం ఆటగాళ్లను బట్టి ఉంటుందని, ఈ నేపథ్యంలో మళ్లీ  కెప్టెన్‌, కోచ్‌లకే ఆ అధికారాన్ని కల్పించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సతీమణుల ప్రయాణ విషయంలో ఇలా భేదాభిప్రాయాలు రావడం భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్నారు.

చదవండి: ‘తోడు–నీడ’కు సై...

మరిన్ని వార్తలు