జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం

25 Aug, 2019 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్‌ కోహ్లి, ధావన్, ఇషాంత్‌ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్‌ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్‌తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు.

మరిన్ని వార్తలు