అజహర్‌కు రూ. 1.5 కోట్లు 

4 Dec, 2019 00:25 IST|Sakshi

బాకీలు చెల్లించనున్న బీసీసీఐ

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌కు బాకీగా ఉన్న రూ. కోటీ 50 లక్షలను చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మొత్తాన్ని అజహర్‌కు ఇవ్వాలని బోర్డు ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. బోర్డు నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్‌ తదితర సౌకర్యాలతో కలిపి అజ్జూకు రూ. కోటిన్నర రావాల్సి ఉంది. అయితే అతనిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించిన నిషేధం కొనసాగుతుండటంతో బోర్డు వీటిని నిలిపివేసింది. 2012లోనే ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితమే అజహర్‌ విజ్ఞప్తి చేశాడు. అయితే సీఓఏ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో గంగూలీ తన తొలి కెప్టెన్‌కు మేలు చేకూర్చేలా అధికారిక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అజహర్‌... భారత్‌ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.

మరిన్ని వార్తలు