ధోని కెరీర్‌పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు

23 Oct, 2019 16:08 IST|Sakshi

ముంబై: లాంఛనం పూర్తయింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యలు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ తొలి మీడియా సమావేశంలో మాట్లాడాడు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బీసీసీఐకి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో అవినీతి రహిత పాలన అందిస్తానని, బోర్డు విశ్వసనీయతను కాపాడతానని గంగూలీ హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని కెరీర్‌పై ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు గంగూలీ ఆసక్తికర సమాధానమిచ్చాడు.
 

‘భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోనిది ప్రత్యేక స్థానం. ఆటగాడిగా, కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. ధోని పట్ల భారత్‌ గర్వంగా ఉంది. అతడు సాధించిన ఘనతలను కూర్చొని రాసుకుంటూ వెళితే ‘వావ్‌’ అనాల్సిందే. నేను పదవిలో ఉన్నంతకాలం ప్రతీ ఒక్కరికీ సరైన గౌరవం దక్కుతుందని హామీ ఇస్తున్నా. అయితే ధోని రిటైర్మెంట్‌ విషయం అనేది అతడి చేతుల్లోనే ఉంది. కెరీర్‌ గురించి అతడి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. అయితే ‘చాంపియన్లు తొందరగా నిష్క్రమించకూడదు’ ఈ అభిప్రాయం కేవలం నా ఒక్కడిదే కాదు యావత్‌ ప్రపంచానిది. నేను కూడా కొంత కాలం క్రికెట్‌ ఆడలేదు అనంతరం జట్టులోకి వచ్చి నాలుగేళ్లు ఆడాను. త్వరలోనే ధోనితో కూడా సమావేశమవుతా

కోచ్‌, కెప్టెన్‌, ఆటగాళ్ల ఎంపిక అంతా సెలక్షన్‌ కమిటీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాల్లో బీసీసీఐ తలదూర్చదు. అంతేకాకుండా గతంలో బీసీసీఐ అధ్యక్షులు, సారథులు మధ్య మంచి సఖ్యతే ఉంది. ఆలాంటి సఖ్యతే కొనసాగిస్తాను. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నాను. సుపరిపాలన అందించడానికి కృషి చేస్తాను’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఈరోజు బాధ్యతలు చేపట్టడంతో 33 నెలల సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) పాలనకు తెరపడింది. దాదాతో జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్‌ సింగ్‌ ధూమాల్‌ కోశాధికారిగా ఈరోజు బాధ్యతలు చేపట్టారు.  

చదవండి:
మహారాజా ఆఫ్‌ విజయనగరం తర్వాత గంగూలీనే 
భారత క్రికెట్‌లో మళ్లీ ‘దాదా’గిరి!​​​​​​​

>
మరిన్ని వార్తలు