రాజస్థాన్ క్రికెట్ సంఘంపై నిషేదం ఎత్తివేత

11 Dec, 2017 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)  రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై కొనసాగుతున్న నిషేదాన్ని ఎత్తి వేసింది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. 

ఇక 2014లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ చైర్మన్‌ లలిత్ మోదీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది.  హైకోర్టు సూచనలతో ఈ ఏడాది జూన్‌లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో లలిత్‌ మోదీ కుమారుడు రుచిర్‌ పై కాంగ్రెస్‌ నేత సీపీ జోషి  ఎన్నికైన విషయం తెలిసిందే.  ఇక సుప్రీం నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ రాజస్థాన్‌ బోర్డు ఏర్పాటు చేసిన అడహక్‌ కమిటీని రద్దు చేయడంతో నిషేదం ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. ఈ నిషేదంతో ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఎలాంటి అంతర్జాతీయ, దేశావాళి మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఆఖరికి ఐపీఎల్‌ మ్యాచ్‌లను సైతం జైపూర్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు