న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఆరంభం వేడుకలకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఐపీఎల్ ఆరంభం వేడుకల్ని జరపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ ఏడాది ఘనంగా జరిగే ఈ వేడుకలకు సినీ సెలబ్రెటీలు హాజరవుతారు. బాలీవుడ్ తారల హంగామాతో సాగే ఆరంభ సంబరానికి సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఫ్యాన్స్ కూడా పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో వృథా ఖర్చును తగ్గించుకోవాలని ఐపీఎల్ పాలక వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గత ఐపీఎల్ సీజన్కు సంబంధించిన ఓపెనింగ్ సెలబ్రేషన్స్ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన బాధితులకు సంతాపంగా వేడుకలను రద్దు చేసి.. ఆ నిధులను నిధులను ప్రభుత్వానికి అందించింది. అందులో రూ.11 కోట్లను భారత ఆర్మీకి, రూ.7 కోట్లు సీఆర్పీఎఫ్కు, రూ.1 కోటి చొప్పున నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందజేసింది.