టీ20 మ్యాచ్‌: రోమాలు నిక్కపొడిచే దృశ్యం

6 Jan, 2020 11:38 IST|Sakshi

గుహవాటి: ఈ ఏడాదిలో టీమిండియా ఆడే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ బార్సపర స్టేడియంలో ఆదివారం జరగాల్సింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ రద్దైనప్పటికీ స్టేడియంలో చోటు చేసుకున్న భావోద్వేగ సంఘటన ప్రతి ఒక్కరి రోమాలను నిక్కపొడిచేలా చేసింది. టాస్‌ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంచనాలను పటాపంచలు చేస్తూ వర్షం అడ్డుపడింది. అయితే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి టీమిండియా అభిమానులంతా జాతీయ గేయమైన ‘వందేమాతరం’ను ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ బోర్డు(బీసీసీఐ)..  ‘గువాహటి.. యూ బ్యూటీ’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేయగా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వర్షం పడుతూ ఉంటే టీమిండియా అభిమాలంతా ఒక్కసారిగా లేచి నిలబడి.. జాతీయ గేయాన్ని ఆలపించి ఆటగాళ్లలో విశ్వాసాన్ని నింపిన  దృశ్యం మమ్మల్ని ఆకట్టుకుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   

కాగా విరాట్‌ కోహ్లి టాస్‌ గురించి మాట్లాడుతూ.. బార్సపరా స్టేడియంలో సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్లు బాగా రాణించాయని.. అందుకే తాను మొదట ఫీల్డింగ్‌కే మొగ్గు చూపినట్లు చెప్పాడు. ‘ గత కొంత కాలం ఇక్కడ ఆడలేదు. అయితే చివరి మ్యాచ్‌ అస్ట్రేలియాతో ఆడినప్పుడు మొదట బ్యాటింగ్‌ చేశాం. అప్పుడు మేము బాగానే రాణించాం’ అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ రద్దు కాగా తదుపరి మ్యాచ్‌ కోసం ఇరుజట్లు ఇండోర్‌కు చేరుకోనున్నాయి.(చదవండి: డ్రయర్‌తో ఆరబెట్టి.. ఐరన్‌ బాక్స్‌తో ఇస్త్రీ చేశారు!)

మరిన్ని వార్తలు