వారియర్స్‌ విజయం

23 Aug, 2019 05:49 IST|Sakshi

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 35–26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. రైడర్‌ మణీందర్‌ సింగ్‌ సూపర్‌ ‘టెన్‌’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్‌ రింకు నర్వాల్‌ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్‌ లో బెంగాల్‌ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్‌ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్‌ చేసింది. ఈ విజయంతో బెంగాల్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్‌ తలైవాస్‌తో యు ముంబా తలపడతాయి. 

>
మరిన్ని వార్తలు