చాంపియన్‌ భరత్‌కుమార్‌ రెడ్డి

28 Jan, 2019 09:50 IST|Sakshi

రన్నరప్‌ శ్రీశ్వాన్‌

తెలంగాణ రాష్ట్ర చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పోలూరి భరత్‌కుమార్‌ రెడ్డి అదరగొట్టాడు. అబిడ్స్‌లోని డైమండ్‌ జూబ్లీ హైస్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భరత్‌ చాంపియన్‌గా నిలిచాడు. టోర్నీలో నిర్ణీత ఆరు రౌండ్లు ముగిసేసరికి అజేయంగా 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచే క్రమం లో హాసిత, పి. అభిషేక్, సాకేత్‌ కుమార్, జి. శ్రీనివాస్, సృజన్‌ కీర్తన్, బిపిన్‌ రాజ్‌లపై వరుసగా ఆరు గేముల్లో విజయం సాధించాడు.

మరోవైపు 5.5 పాయింట్లతో శ్రీశ్వాన్, వి. వరుణ్, తరుణ్, శివ రెండోస్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా శ్రీశ్వాన్‌ రన్నరప్‌గా నిలవగా, వరుణ్‌ మూడో స్థానంలో... తరుణ్, శివ వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సంతృప్తిచెందారు. బిపిన్‌ రాజ్, షణ్ముఖ, అమిత్‌పాల్‌ సింగ్, సృజన్‌ కీర్తన్, ప్రతీక్‌ తలా 5 పాయింట్లతో టాప్‌–10లో చోటు దక్కించుకున్నారు. 4 పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ క్రీడాకారిణి సహజ్‌దీప్‌ కౌర్‌ 49వ స్థానంలో టోర్నీని ముగించింది. ఆమె సంకీర్త్‌ రెడ్డితో జరిగిన రెండోగేమ్, రామ్‌సాగర్‌తో జరిగిన నాలుగో గేమ్‌లో ఓటమి పాలైంది. అభిజిత్‌ అర్కట్, అనీశ్, ధ్రువన్, వెంకట సుబ్బయ్యలతో జరిగిన గేముల్లో గెలుపొంది నాలుగు పాయింట్లతో నిలిచింది.  

మరిన్ని వార్తలు