ధోని ఇక ‘పెళ్లి పెద్ద’

12 Nov, 2018 18:12 IST|Sakshi

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని చరిష్మా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన హెలికాప్టర్‌ షాట్లతో.. కళ్లు చెదిరే రీతిలో చేసే కీపింగ్‌తో.. ఇక అన్నింటికి మించి మిస్టర్‌ కూల్‌గా తీసుకునే నిర్ణయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించడంతో జార్ఖండ్‌ డైనమైట్‌కు క్రేజ్‌ పెరుగుతూవస్తోంది. దీంతో ధోనికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని పలుకంపెనీలు పోటీపడుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో పెళ్లిసంబంధాలు కుదిర్చే పాపులర్‌ వెబ్‌సైట్‌ భారత్‌ మ్యాట్రిమోనికి ప్రచారకర్తగా ధోని నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఒప్పందం గురించి ధోనితో పాటు సంస్థ సీఈఓ జానకిరామన్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. (మ్యాచ్‌లో ధోని లేకపోయినా..)
 

‘గత 18ఏళ్లుగా ఎంతో మందికి తమ సహచర భాగస్వామిని ఎంపిక చేసుకోవటానికి భారత్‌ మ్యాట్రిమోని ఎంతగానో ఉపయోగపడింది. లక్షల వివాహాలు జరిపించింది. వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. అత్యంత నమ్మకమైన సంస్థతో పనిచేయడం ఆనందంగా, గర్వంగా ఉంది’అంటూ ధోని పేర్కొన్నారు. ఇక సంస్థ సీఈఓ జానకిరామన్‌ మాట్లాడుతూ..‘ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఎంఎస్‌ ధోనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అతడి వివాహ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గొప్ప భర్తగా, బాధ్యత గల తండ్రిగా ధోని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు’అంటూ కొనియాడారు. ఇక ఈ డీల్‌ను ధోని స్పోర్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ కుదిర్చింది. (ధోని వేటుపై సచిన్‌ ఏమన్నాడంటే..)

మరిన్ని వార్తలు