సెమీస్‌లో బీహెచ్‌ఈఎల్, ఈగల్స్‌

18 Mar, 2017 10:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నవాబ్‌ షుజాత్‌ అహ్మద్‌ ఖాన్‌ స్మారక బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఈగల్స్, బీహెచ్‌ఈఎల్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సిటీ కాలేజ్‌ గ్రౌండ్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్‌ జట్టు 57– 47తో షార్ప్‌ షూటర్స్‌ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ షార్ప్‌ షూటర్స్‌ యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. బీహెచ్‌ఈఎల్‌ జట్టులో రాజు, రాహుల్‌ చెలరేగడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 29–22తో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 

తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మూడో క్వార్టర్‌లో 48–30తో ఏకంగా 18 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో షార్ప్‌ షూటర్స్‌ దీటుగా పోరాడినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరికి 10 పాయింట్ల తేడాతో బీహెచ్‌ఈఎల్‌ గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్‌ తరఫున రాజు (13), పాల్‌ (13) ఆకట్టుకున్నారు. షార్ప్‌ షూటర్స్‌ జట్టులో అశ్విన్‌ 17 పాయింట్లు స్కోర్‌ చేయగా.. ఒమేర్‌ 12 పాయింట్లు చేశాడు.

ఈగల్స్‌ జోరు
రాజేంద్రనగర్‌ బాస్కెట్‌బాల్‌ క్లబ్‌తో జరిగిన మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఈగల్స్‌ జట్టు 52– 28తో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజేంద్రనగర్‌ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈగల్స్‌ జట్టులో రోహన్‌ (21), అమన్‌ (15) అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాజేంద్రనగర్‌ జట్టు తరఫున సలీమ్‌ (16) ఒక్కడే చివరి వరకు పోరాడాడు.

 

మరిన్ని వార్తలు