ప్రిక్వార్టర్స్‌లో భువన

28 Nov, 2017 10:48 IST|Sakshi

 ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో రాష్ట్ర క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో భువన కాల్వ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా, సామ సాత్విక తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భువన 6–3, 6–3తో ప్రేరణ బాంబ్రీపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సామ సాత్విక 6–4, 3–6, 1–6తో ధ్రుతి వేణుగోపాల్‌ చేతిలో ఓడిపోయింది.

డబుల్స్‌ విభాగంలో సామ సాత్విక–రిషిక సుంకర జోడీలు క్వార్టర్స్‌కు చేరుకోగా... నిధి చిలుముల, షేక్‌ హుమేరా బేగం, సాయిదేదీప్య, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జంటలు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాయి. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సామ సాత్విక–జెన్నిఫర్‌ (భారత్‌) జంట 7–6 (7/5), 6–2తో షేక్‌ హుమేరా బేగం–సౌమ్య జోడీపై, రిషిక సుంకర–శ్వేత చంద్ర (భారత్‌) ద్వయం 6–1, 7–5తో సాయిదేదీప్య–సారా యాదవ్‌ (భారత్‌) జంటపై గెలుపొందాయి. శ్రీవల్లి రష్మిక–మౌలిక రామ్‌ జంట 2–6, 4–6తో హెర్డ్‌జెలస్‌ డియా (బోస్నియా)–సు చింగ్‌ వెన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ–నిధి జంట 4–6, 0–6తో రియా–స్నేహాదేవి జోడీ చేతిలో ఓడిపోయింది.   

మరిన్ని వార్తలు