సెమీస్‌లో భువన, సాత్విక

6 Oct, 2017 10:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు భువన కాల్వ, సామ సాత్విక సెమీఫైనల్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ ముందంజ వేయగా, నగరానికే చెందిన షేక్‌ హుమేరా, శ్రావ్య శివానిలు పరాజయం పాలయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో భువన (తెలంగాణ) 0–6, 6–4, 6–3తో ఆరో సీడ్‌ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)ను బోల్తా కొట్టించగా... షేక్‌ హుమేరా (తెలంగాణ) 2–6, 4–6తో టాప్‌ సీడ్‌ జీల్‌ దేశాయ్‌ (గుజరాత్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు అండర్‌–18 బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సామ సాత్విక (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో ప్రేరణ విచారే (మహారాష్ట్ర)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకోగా, శ్రావ్య శివాని (తెలంగాణ) 2–6, 1–6తో తనీషా కశ్యప్‌ (అస్సాం) చేతిలో, షేక్‌ హుమేరా (తెలంగాణ) 1–6, 3–6తో వైదేహి చౌదరి (గుజరాత్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.  

టైటిల్‌ పోరుకు సాయిదేదీప్య జోడి

ఈ టోర్నీ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాయాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్‌–18 బాలికల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో దేదీప్య–సారాయాదవ్‌ ద్వయం 6–4, 6–1తో సోహా–సృష్టి జంటపై విజయం సాధించింది. ఫైనల్లో సాయిదేదీప్య జోడి స్నేహా రెడ్డి (తమిళనాడు)–శ్వేతా రాణా (ఢిల్లీ) జంటతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు