భువీ నోబాల్‌.. నెటిజన్ల ఫైర్‌

17 Jul, 2018 14:10 IST|Sakshi

హైదరాబాద్‌ : టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేలకు ఈ స్టార్‌ బౌలర్‌ దూరమైన విషయం తెలిసిందే. అయితే సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేకు భువీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసి అభిమానులంతా సంతోషించారు. కానీ బీసీసీఐ చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. మూడో వన్డే సన్నాహకంలో భాగంగా భువీ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అయితే ఈ వీడియోలో భువనేశ్వర్‌ నోబాల్‌ వేశాడు. ఇదే అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ప్రాక్టీస్‌ సెషన్‌లో నోబాల్‌ ఏంటనీ ఒకరు కామెంట్‌ చేస్తే.. బౌలింగ్‌ కోచ్‌ ఏం చేస్తున్నాడని ఇంకోకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే అభిమానులు ఇంతలా రియాక్ట్‌ అవడానికి కారణం ఉంది. మ్యాచ్‌లో బౌలర్ల తప్పిదం భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తోంది. గత చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్‌ బుమ్రా చేసిన తప్పుతో టీమిండియా ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసిన విషయమే.

ఇక విమర్శలను పక్కనపెడితే భువీ రాక కోహ్లిసేనకు బలం చేకూరనుంది. రెండో వన్డేలో భారత బౌలర్లను  ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ సునాయాసంగా ఆడేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం కుల్దీప్ మాత్రమే వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో భువీ జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.

చదవండి: ‘ఆమె నా భార్య ఆదివారం మాత్రమే నీ భార్య’ 

మరిన్ని వార్తలు