సఫారీలకు భువీ షాక్‌

5 Jan, 2018 14:32 IST|Sakshi

కేప్‌టౌన్‌: భారత్‌తో ఆరంభమైన తొలి టెస్టు ఆదిలోనే దక్షిణాఫ్రికాకు షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో ఓపెనర్‌ మక్రమ్‌(5) అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లను భువనేశ్వర్‌ కుమార్‌ సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వేసి తొలి ఓవర్‌ మూడో బంతికే ఎల్గర్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వెళుతున్న బంతిని హిట్‌ చేయబోయి కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

దాంతో సఫారీల స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఆ జట్టు మొదటి వికెట్‌ను నష్టపోయింది. అటు తరువాత భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి మక్రమ్‌ ఎల్బీగా అవుటయ్యాడు.కాగా,  భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఐదో ఓవర్‌ ఐదో బంతికి హషీమ్‌ ఆమ్లా(3) పెవిలియన్‌కు చేరాడు. కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌ గా అవుటయ్యాడు. దాంతో 12 పరుగులకే సఫారీలు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

ఇదిలా ఉంచితే, టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేతుల మీదుగా టెస్ట్‌ క్యాప్‌ అందుకున్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన బుమ్రా టెస్టుల్లో సత్తా చాటేందుకు బరిలోకి దిగుతున్నాడు. శిఖర్‌ ధవన్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. రాహుల్‌, రహానే, ఇషాంత్‌ శర్మలను తీసుకోలేదు.

మరిన్ని వార్తలు