స్వదేశంలో భారత షూటర్లకు చేదు అనుభవం

10 May, 2017 00:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ షూటింగ్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చిన భారత షూటర్లకు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. వారి దగ్గరున్న గన్స్, మందుగుండు క్లియరెన్స్‌ కోసం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు దాదాపు పది గంటలపాటు వారిని నిరీక్షించేలా చేశారు. చైన్‌ సింగ్, గుర్‌ప్రీత్‌ సింగ్, హీనా సిద్ధూ, కైనన్‌ చెనాయ్‌ తదితరులతో కూడిన 13 మంది బృందం సైప్రస్‌ నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు.

అయితే క్లియరెన్స్‌ పేరిట అధికారులు వీరిని మధ్యాహ్నం 2.30కి బయటికి వదిలారు. ఈ ఉదంతంపై దిగ్గజ షూటర్‌ అభినవ్‌ బింద్రా ఘాటుగా స్పందించాడు. ‘ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వారి గన్లకు క్లియరెన్స్‌ ఇవ్వకపోవడం దారుణం. అసోసియేషన్‌ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం బాధించింది. అసలు భారత క్రికెటర్లు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా?’ అని బింద్రా ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు