బోపన్న-మెర్జియా జంటకు ‘మాడ్రిడ్’ టైటిల్

11 May, 2015 00:49 IST|Sakshi

మాడ్రిడ్ (స్పెయిన్) : ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అద్భుత విజయం సాధించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఒక మ్యాచ్ పాయింట్ కాచుకున్న బోపన్న జంట 6-2, 6-7 (5/7), 11-9తో ఐదో సీడ్ మట్కోవ్‌స్కీ (పోలండ్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడీని ఓడించింది.

85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ దక్కించుకున్న బోపన్న ద్వయం రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో 8-9తో ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న కెరీర్‌లో ఇది మూడో ‘మాస్టర్స్ సిరీస్’ టైటిల్ కావడం విశేషం.

35 ఏళ్ల ఈ బెంగళూరు ప్లేయర్ 2011లో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)తో, 2012లో మహేశ్ భూపతి (భారత్)తో కలిసి పారిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో 13వ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్. విజేతగా నిలిచిన బోపన్న-మెర్జియాలకు ప్రైజ్‌మనీగా 2,47,560 యూరోలు (రూ. కోటీ 76 లక్షలు) లభించాయి.

మరిన్ని వార్తలు